'మహర్షి' దర్శకుడితో పవన్ కల్యాణ్?

  • పవన్ తో దిల్ రాజు ఫస్టు మూవీగా 'వకీల్ సాబ్'
  • రెండవ సినిమా కోసం సన్నాహాలు
  • వంశీ పైడిపల్లి కథకు దిల్ రాజు ఓకే

పవన్ కల్యాణ్ - దిల్ రాజు కాంబినేషన్లో ఇటీవల 'వకీల్ సాబ్' వచ్చింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో, ఒక రేంజ్ లో పవన్ రీ ఎంట్రీ జరిగింది. తమ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమానే భారీ విజయాన్ని సాధించడంతో, మరో సినిమాను చేయాలని దిల్ రాజు - పవన్ నిర్ణయించుకున్నారు. అందుకోసం పవన్ బాడీ లాంగ్వేజ్ కి తగిన విభిన్నమైన కథలను రెడీ చేయమని వేణు శ్రీరామ్ తో పాటు, మరో ఇద్దరు దర్శకులకు దిల్ రాజు చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ప్రాజెక్టుకు దర్శకుడిగా వంశీ పైడిపల్లి పేరు తెరపైకి వచ్చింది.

దిల్ రాజు కొత్త కథల కోసం ఎదురుచూస్తున్నాడని తెలిసిన వంశీ పైడిపల్లి, తాను సిద్ధం చేసిన ఒక కథను వినిపించాడట. ఆ కథ వైవిధ్యభరితంగా అనిపించడంతో, దిల్ రాజు ఓకే చెప్పాడని అంటున్నారు. ఈ కథను పవన్ కి వినిపించవలసి ఉంది. ఇటీవల కరోనా బారిన పడిన పవన్, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. పూర్తిగా కోలుకున్న తరువాతనే ఆయన ఈ కథను వినే అవకాశం ఉంది. 'మహర్షి' తరువాత వంశీ పైడిపల్లి చేసే ప్రాజెక్టు ఇదే అయితే బాగానే ఉంటుంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలు పూర్తి చేసిన తరువాతనే పవన్ మళ్లీ దిల్ రాజుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


Pavan kalyan
Dil Raju
Vamsi Paidipalli

More Telugu News